ఎదురుదాడి మాని, సాయం చేయండి: బాబు
హైదరాబాద్: వరద తాకిడి ప్రాంతాల్లో సహాయ చర్యలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. వరద సహాయానికి వేయి కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరద తీవ్రతపై శుక్రవారం శాసనసభలో ప్రారంభమైన చర్చలో ఆయన పాల్గొన్నారు. వరద బాధితుల సహాయానికి కేంద్ర సహాయం కోరాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వరద సహాయ చర్యల్లో నిర్లక్ష్య వైఖరి చోటు చేసుకుందని ఆయన అన్నారు. తమపై ఎదురుదాడికి దిగడం మానేసి వరద బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
వరద సహాయం అందించడంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని వరద సహాయ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలేసి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు మూడు వేల రూపాయలేసి ఇవ్వాలని ఆయన కోరారు. వరద తాకిడి ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి 40 కిలోల బియ్యం, పది లీటర్ల కిరోసిన్, 5 కిలోల పప్పు ధాన్యాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఇసుక మేటలను ప్రభుత్వమే తీసేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చంపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పోలవరం ప్రాజెక్టును చేపట్టడం వల్ల గోదావరి వరదలను ఆపలేమని తమ్మినేని వీరభద్రం (సిపియం) అన్నారు. వరద సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. వరద సాయం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని చాడ వెంకటరెడ్డి (సిపిఐ) విమర్శించారు.












Click it and Unblock the Notifications
