తెరాస అగ్రనేతలపై ఎమ్యెల్యే మందాడి ధ్వజం
హైదరాబాద్: వెంటనే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని, రాజీనామా లేఖలను రాష్ట్రపతికి అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యానారాయణ రెడ్డి తమ పార్టీ అగ్రనేతలు కె చంద్రశేఖరావును, ఎ నరేంద్రను డిమాండ్ చేశారు. పార్టీకి సొంత విధానమంటూ లేకుండా పోయిందని, తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన అంశాలపై కూడా తమ పార్టీ శాసనసభ్యులకు చర్చకు తీసుకుంటున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీకి ఒక విధానమంటూ లేకుండా పోయిందని ఆయన అన్నారు. తమ పబ్బం గడుపుకోవడానికే తమ పార్టీ శాసనసభ్యులు 610 జీవోపై చర్చకు పట్టుబట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్యలపై పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.
తమ పార్టీ శాసనసభ్యులకు 610 జీవోపై చర్చ జరగాలని వుంటే తాను వాయిదా తీర్మానం ఇచ్చాను కదా, వేరే ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. తాను వాయిదా తీర్మానం ఇస్తున్న విషయాన్ని శాసనసభా పక్షం కార్యాలయం ఉద్యోగి రమేష్ పార్టీలోని అవతలి పక్షానికి చేరవేశాడని, దాంతో వారు ఆఘమేఘాల మీద వాయిదా తీర్మానం ప్రతిపాదించారని ఆయన అన్నారు. క్రెడిట్ వేరేవారికి పోకూడదనే ఉద్దేశంతో వారు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఉత్తర తెలంగాణలోని వరద తాకిడి ప్రాంతాల్లో తమ అగ్రనేతలు కె. చంద్రశేఖర రావు, నరేంద్ర పర్యటించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. 610 జీవో అమలు అంశాన్ని తాను గతంలో శాసనసభలో లేవనెత్తానని, దాన్ని అమలు చేస్తామని అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీకి ప్రభుత్వం కట్టుబడి వ్యవహరించలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
