610 జీవోపై చర్చకు తెరాస పట్టు: గందరగోళం
హైదరాబాద్: తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో న్యాయం చేసేందుకు జారీ చేసిన 610 జీవోను అమలుపై చర్చకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు పట్టుబట్టడంతో శుక్రవారం ఉదయం శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. 610 జీవో అమలుపై చర్చకు తెరాస వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. దీనిపై చర్చకు స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి అనుమతించలేదు. అయినా తెరాస సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఒకానొక సందర్భంలో శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్యకు, తెరాస శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డికి మధ్య వాగ్వివాదం చెలరేగింది.
610 జీవో అమలుపై శాసనసభలో చర్చకు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని తెరాస శాసనసభ్యులు పట్టుబట్టారు. దీంతో సభ కార్యక్రమాలు స్తంభించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. చర్చ చేద్దామని రోశయ్య అంటే, ఎప్పుడు చర్చనేనా, ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని నాయని నర్సింహారెడ్డి అన్నారు. అయితే చర్చ చేద్దామని రోశయ్య వ్యంగ్యంగా అన్నారు. చర్చ ఎప్పుడు చేపడతారో చెప్పాలని తెరాస శాసనసభ్యులు పట్టుబట్టారు. ఆ రకంగా వ్యంగ్యంగా మాట్లాడి తెలంగాణ ప్రజలను రోశయ్య అవమానిస్తున్నారని నాయని నర్సింహారెడ్డి విమర్శించారు. 610 జీవో అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నాయని నర్సింహా రెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications
