కాల్పుల్లో శంతన్కు గాయాలు: అనుచరుడి మృతి
విజయవాడ: విజయవాడ కోర్టు ఆవరణలో వంగవీటి శంతన్కుమార్పై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారంనాడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శంతన్కుమార్ గాయపడగా ఆయన అనుచరుడు మృతి చెందాడు. ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి దిగినట్లు భావిస్తున్నారు. అయితే అనుమానాస్పదంగా వున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒక కేసులో వాయిదాకు హాజరై తిరిగి వెళ్తుండగా శంతన్కుమార్పై కాల్పులు జరిగాయి. శంతన్కుమార్ ఛాతీలో రెండు బుల్లెట్లున్నాయి. ఎడమ భుజంలో మరో బుల్లెట్ వుంది.మాజీ శాసనసభ్యుడు వంగవీటి చలపతిరావు కుమారుడు శంతన్కుమార్పై శుక్రవారం మధ్యాహ్నం 12, పన్నెండున్నర గంటల మధ్య జరిగింది. ప్రస్తుతం ఆయన హెల్ప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 24 గంటలు గడిస్తే తప్ప శంతన్ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు.
తెలుగుదేశం నాయకుడు కాట్రగడ్డ బాబుకు, శంతన్కుమార్కు మధ్య చాలా కాలంగా పాత కక్షలు ఉన్నాయి. శంతన్పై కాల్పులకు ఈ కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. శంతన్కుమార్ చేతికి బుల్లెట్ గాయం జరిగింది. ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆయనను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు.శంతన్పై జరిగిన దాడిలో తన ప్రమేయం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు కాట్రగడ్డ బాబు స్పష్టం చేశారు. తన ప్రమేయం వున్నట్లు ఏ మాత్రం రుజువులు చూపినా ఉరి వేసుకుంటానని ఆయన అన్నారు. తనపై దాడులు చేయించడానికి శంతన్ పలుమార్లు ప్రయత్నాలు చేశారని, ఈ విషయాన్ని పోలీసులే చెప్పారని, తాను శంతన్పై దాడులు చేయించడానికి ఏనాడూ ప్రయత్నించలేదని ఆయన అన్నారు.