భూ కేటాయింపుపై అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్: కాందిశీకులకు భూమి కేటాయింపు వ్యవహారంపై సోమవారం శాసనసభలో గందరగోళం చెలరేగింది. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడాలో 200 ఎకరాల భూమిని కాందిశీకులకు కేటాయించడంలో అక్రమాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సభ్యుడు పయ్యావుల కేశవ్ ప్రశ్నోత్తరాల సమయంలో విమర్శించారు. దీనిపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇచ్చిన సమాధానంతో తెలుగుదేశం సభ్యులు సంతృప్తి చెందలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వ్యవహారం నడిచిందని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. దీనికి టిడిపి సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు.
రెవెన్యూ అధికారి రోశయ్య ఇచ్చిన తీర్పును తాము అంగీకరించకుండా కోర్టులో సవాల్ చేశామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడికి మధ్య వాగ్వివాదం చెలరేగింది. అవుటర్ రింగ్ రోడ్డుపై చర్చ సందర్భంగా కాందిశీకులకు భూమి కేటాయించిన అంశంపై కూడా చర్చ జరపవచ్చునని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు స్పీకర్ అంగీకరించారు. అయితే టిడిపి సభ్యులు అందుకు అంగీకరించలేదు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి సభను టీ విరామం కోసం వాయిదా వేశారు.