రింగు రోడ్డుపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై గురువారం శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. అవుటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి పెద్దలకు ఉపయోగపడేలా ప్రభుత్వం వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశంపై ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్కుమార్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. గత చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఐయంజికి విలువైన భూములను అప్పగించారని ఆరోపిస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని - చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒక నేరస్థుడిని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందని ఆయన గౌరు వెంకటరెడ్డి ఉదంతాన్ని ఉద్దేశించి అన్నారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అవినీతిని ప్రస్తావించదలుచుకుంటే చాలా వున్నాయని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంలోని 21 ప్రాజెక్టులపై వైయస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, అవన్నీ సక్రమంగానే ఉన్నాయని భావించిందని, ఇందులో ముఖ్యమంత్రి డబ్బులు తీసుకున్నారా? అని ఆయన అన్నారు.
నిపుణుల సలహా మేరకే రింగ్రోడ్డు అలైన్మెంట్ను మార్చినట్లు కిరణ్కుమార్ రెడ్డి చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు వల్ల 741 మంది భూములు కోల్పోతున్నారని, వారందరికీ ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లిస్తుందని ఆయన చెప్పారు. అంతకు ముందు దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ వేల ఎకరాలను సేకరిస్తున్నట్లు ముందు నోటీసులు ఇచ్చి తర్వాత వాటిని ఉపసంహరించుకోవడం వల్ల చాలా భూములు దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆయన అన్నారు. అంతకు ముందు తెరాస సభ్యుల సస్పెన్షన్ తర్వాత స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. నేరుగా అవుటర్ రింగ్ రోడ్డుపై చర్చకు అనుమతించారు. బుధవారంనాడు టిడిపి సభ్యుడు దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ సభ్యుడు చల్లా రామకృష్ణా రెడ్డి మధ్య చోటు చేసుకున్న వ్యక్తిగత దూషణలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి గురువారంనాడు తెలియజేశారు.