రింగ్రోడ్డు అభివృద్ధి, రాజకీయాలు వద్దు: ధర్మాన
హైదరాబాద్: హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణంపై రాజకీయం చేసే ప్రయత్నాలు, ప్రజలకు అనుమానాలు కలిగించే ప్రయత్నాలు చేయవద్దని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రింగ్ రోడ్డుపై జరిగిన చర్చకు ఆయన గురువారం సాయంత్రం సమాధానమిచ్చారు. సాంకేతిక, పర్యావరణ, ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించేలా రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ఐదేళ్లను దృష్టిలో పెట్టుకుని రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తే, తాము వచ్చే 50 యేళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డును నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. రింగ్రోడ్డు నిర్మాణాన్ని హైదరాబాద్ ప్రజలందరూ హర్షిస్తున్నారని ఆయన చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తున్నామని ఆయన చెప్పారు.
రింగ్ రోడ్డు వల్ల హైదరాబాద్ పరిసరాల్లోని జిల్లాలన్నీ అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. భూముల ధరలు ఇతోధికంగా పెరిగి ఆర్థికంగా స్థానికులు లాభపడతారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతం భూములను ఇతర ప్రాంతాల వారికి ఇచ్చేస్తున్నారనే అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పెరుగుతున్న హైదరాబాద్ జనాభాను విస్తరింపజేయడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల, నిర్ణయాల వల్ల ఐటి కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయని, వాటికి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం వుందని, అందులో భాగమే రింగ్ రోడ్డు నిర్మాణమని ఆయన చెప్పారు. భూములు కోల్పోయినవారికి ఒక్కొక్కరికి 200 చదరపు గజాల చొప్పున భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్నామని, దాని ధర 60 లక్షల రూపాయలు వుంటుందని, ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయడానికి వీలు లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ చుట్టు జరుగుతున్న అభివృద్ధి వల్ల భూముల ధరలు పెరుగుతున్నాయని, ఇది ప్రజలకు మేలు చేస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
