సుప్రీం వ్యాఖ్యలు వైయస్కు చెంపపెట్టు: ఎర్రం
శ్రీకాకుళం: కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరు సుచరితా రెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డికి ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై, చట్టంపై విశ్వాసం లేదని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై, చట్టంపై నమ్మకం వుంటే ప్రభుత్వం గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టి వుండేది కాదని ఆయన అన్నారు. జిల్లాకు యస్పీ, కలెక్టరు రెండు కళ్లు అని, అటువంటివారు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా నివేదికలు రాసి వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టడానికి సహకరించారని ఆయన అన్నారు. ఈ రకంగా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వంపై ఎవరికి నమ్మకం వుంటుందని ఆయన అడిగారు.