తెలంగాణపై కిషన్, శ్రీధర్ మాటకు మాట
హైదరాబాద్: తెలంగాణ అంశంపై గురువారం శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధరబాబుకు, బిజెపి సభ్యుడు జి. కిషన్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై చర్చ సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది. కిషన్ రెడ్డి వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ శ్రీధర్బాబు - తాము తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని, ఈ విషయాన్ని తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో పెట్టామని, అందువల్ల ప్రస్తుతం మాట్లాడడం లేదని అన్నారు. తెలంగాణపై సోనియా గాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వుంటామని ఆయన చెప్పారు. నిజానికి తెలంగాణ అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా బిజెపి వ్యవహరించిందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తెలంగాణను పక్కన పెట్టిన బిజెపి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో స్నేహం కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
శ్రీధర్బాబు విమర్శలకు కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 40 మంది తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీ (టిఆర్సిసిసి)కి చెందిన సభ్యులు సోనియాకు విజ్ఞప్తి చేశారని, ఇప్పుడు వారేమయ్యారని కిషన్ రెడ్డి అన్నారు. సీట్లు సంపాదించుకున్న తర్వాత తెలంగాణ అంశాన్ని టిఆర్సిసిసి నాయకులు ప్రస్తావించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ 1969లో మోసం చేసిందని, 400 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుందని, తెలంగాణ ఇస్తామని తెరాసతో ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్ మరోసారి మోసానికి సిద్ధపడిందని ఆయన అన్నారు. తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని ఆయన అన్నారు.