ఎవరి మీదా ఫిర్యాదు చేయను: లగడపాటి
న్యూఢిల్లీ: తాను ఢిల్లీ వచ్చింది ఎవరి మీదో ఫిర్యాదు చేయడానికి కాదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం ఇక్కడ చెప్పారు. తాను తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని, ఆ విషయాన్ని ఎస్సార్సీ నిర్ణయిస్తుందని రాజగోపాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉజ్వల చరిత్ర ఉందని, కాంగ్రెస్ సెంటిమెంట్కు వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నాయకులే వ్యాఖ్యానించడం తనను ఆవేదనకు గురి చేసిందని ఆయన చెప్పారు. తనకు ఈరోజు అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నాయకులను కలుసుకుని తన వాదనను వినిపిస్తానని చెప్పారు. రేపు హైదరాబాద్లో జరుగనున్న పిసిసి అత్యనసర సమావేశానికి హాజరవుతానని ఆయన తెలిపారు. ఇలా ఉండగా లగడపాటిపై తెలంగాణ విద్యార్ధుల దాడిని ఖండిస్తూ కృష్ణాజిల్లా నందిగామ, కంచికచర్ల, చందర్లపాడులో మంగళవారం బంద్ జరిగింది. అలాగే లగడపాటి వ్యాఖ్యలని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్లో టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శన చేశారు.