సోనియాది రెండో ఎస్సార్సీ మాటనే: వైయస్
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర డిమాండ్పై రెండో ఎస్సార్సీ వేస్తామని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారని, రెండో ఎస్సార్సీకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అంగీకరించిందని, ఈ విషయమై ఇరు పార్టీల మధ్య రాతపూర్వక ఒప్పందం జరిగిందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో తొందర పడవద్దని అన్ని రాజకీయ పార్టీలు చెప్పినా వినకుండా గొంతు మీద కత్తి పెట్టినట్లు వ్యవహరిస్తే న్యాయమా అని ఆయన తెరాసను అడిగారు. ఏకాభిప్రాయ సాధన బాధ్యతను ప్రణబ్ ముఖర్జీకి అప్పగించారని, ఆ పెద్ద మనిషి నిర్ణయానికి కట్టుబడి ఉండడం న్యాయమని ఆయన అన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని అధికారంలో ఉన్న యన్డిఎను కాంగ్రెస్ కోరిందని, అందుకు యన్డిఎ ముందు రాలేదని, ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడితే బిజెపిని ఎలా నమ్మగలమని ఆయన అన్నారు. తెలంగాణ సంపూర్ణ అభివృద్ధికి తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు. తాము తెలంగాణపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్నామని సోనియా గాంధీ స్పష్టంగా చెప్పినా వినకపోవడం న్యాయం కాదని ఆయన అన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు మేలు చేసే ఆలోచన ఏనాడూ చేయలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువను ఆయన మంగళవారం జాతికి అంకితం చేశారు. 2008 నాటికి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో నీరందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత 20 ఏళ్లలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులు సగం మాత్రమే పూర్తయ్యాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా సగం పూర్తి చేయగలిగామని ఆయన చెప్పారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా నల్లగొండ జిల్లాలోని పది లక్షల ఎకరాలకు నీరిందిస్తామని, తద్వారా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల కన్నా నల్లగొండ వ్యవసాయాభివృద్ధిలో ముందుంచడానికి పని చేస్తామని ఆయన చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధి వుండాలని, నిధులు సమీకరించి ఖర్చు పెట్టే సత్తా వుండాలని, ఆ సత్తా తమకు ఉందని ఆయన చెప్పారు. శ్రీశైలం నుంచి సొరంగం ద్వారా నీరందించే ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత తమకే దక్కుతుందని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు రెండేళ్లలో పూర్తిస్థాయిలో కృష్ణా నదీజలాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయడానికి పని చేస్తున్నామని ఆయన చెప్పారు. ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించామని, అయితే బిజెపికి చెందినవారు కోర్టుకు వెళ్లి అడ్డంకులు కల్పించారని, ఈ అడ్డంకులను అధిగమిస్తామని ఆయన అన్నారు.