కక్ష సాధింపునకే: వైయస్ తోడల్లుడు సుబ్బారెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై రాజకీయ కక్ష సాధించడానికే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు భూ వ్యవహారంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి తోడల్లుడు సుబ్బారెడ్డి అన్నారు. ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వున్న తనకు భూములు అమ్మడం, కొనడం మామూలేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాజశేఖర రెడ్డిపై కక్ష సాధించాలనే ప్రయత్నం వెనుక తెలుగుదేశం పార్టీ వుందని ఆయన అన్నారు. కర్ణాటకలో మినీ జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలోనూ తమపై అదే విధమైన విమర్శలు చేశారని ఆయన అన్నారు. ఆ ప్రాజెక్టు వ్యవహారం కోర్టులో ఉన్నందున పనులు ఆపేశానని ఆయన చెప్పారు. రాజశేఖర రెడ్డి బంధువులు అనేవారు ఈ రాష్ట్రంలో ఏ పనీ చేయకూడదా అని ఆయన అడిగారు.
తాను అవుటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక తయారైన తర్వాత భూములు కొన్నాననే ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. తాను ఆరు ఎకరాల 30 గుంటల భూమి కొన్నానని ఆయన చెప్పారు. తాను 68 ఎకరాల భూమి కొన్నానంటూ వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన అన్నారు. తాను అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ప్రణాళిక రూపొందిన తర్వాత 68 ఎకరాల భూమి కొన్నట్లు వారంలోగా రుజువు చేయలేకపోతే న్యాయపోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ఆ వార్తపై తాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ఉస్మాన్ నగర్లో తాను రెండెకరాల భూమి కొన్నట్లు వార్త రాశారని, నిజానికి నాలుగు ఎకరాలు కొన్నానని ఆయన చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పరిసరాల్లో కాంగ్రెస్వారు, ముఖ్యమంత్రి సమీప బంధువులకే భూములన్నాయా, తెలుగుదేశం పార్టీ వారికి లేవా అని అడిగారు. తెలుగుదేశం పార్టీవారికి ఉన్న భూముల గురించి ఎందుకు రాయరని ఆయన ప్రశ్నించారు.