మావోయిస్టుల రాకెట్ లాంచర్లపై కేంద్రం ఆరా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల రాకెట్ లాంచర్ల లభ్యం, తమిళనాడులో రాకెట్ లాంచర్లు ఉత్పత్తి కేంద్రాల వెల్లడి అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ విషయమై హోం శాఖ కార్యదర్శి దుగ్గల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమిళనాడు పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ ఐజి అరవిందరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిజిపి స్వరణ్జిత్ సేన్ విదేశీ పర్యటనలో ఉన్నందున సమావేశంలో పాల్గొనలేకపోయారు.
మావోయిస్టులకు, ఎల్టిటిఇకి గల సంబంధాలపై కూడా దృష్టి పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశంలో దుగ్గల్ చెప్పారు. మావోయిస్టుల రాకెట్ లాంచర్ల కేసులో తమ దర్యాప్తు వివరాలను ఆంధ్రప్రదేశ్తో పంచుకుంటామని ముఖర్జీ చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది.