నాపై ఫిర్యాదు పిల్లచేష్ట: సోలి సొరాబ్జి
న్యూఢిల్లీ: తనపై రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం పిల్లచేష్ట అని మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జి అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలో ఏ విధమైన తప్పు లేదని ఆయన ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఎమిస్క్యూరీ అయినంత మాత్రాన తాను భావస్వేచ్ఛను ఎలా కోల్పోతానని ఆయన అడిగారు. భావస్వేచ్ఛ గురించి రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమంటారో చూద్దామని ఆయన అన్నారు. తాను చట్టపరమైన పరిస్థితిని మాత్రమే చెప్పానని ఆయన అన్నారు.
గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టడంలో గవర్నర్ తప్పేమీ లేదని, తప్పంతా రాష్ట్ర మంత్రి వర్గానిదేనని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించి సిఫార్సు చేస్తే గవర్నర్ ఆమోదిస్తారని ఆయన అన్నారు. తనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించడం హాస్యాస్పదమని, తానేమీ భయపడడం లేదని ఆయన అన్నారు. అయినా ఫిర్యాదు చేసిన తర్వాత చూద్దామని ఆయన అన్నారు. అలా ఫిర్యాదు చేయడం అవివేకమని ఎవరైనా చెప్తారని తాను అనుకుంటున్నానని ఆయన అన్నారు.