ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం: ఇద్దరి అరెస్టు
బెంగుళూర్: కర్ణాటకలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు శుక్రవారంనాడు భగ్నం చేశారు. కర్ణాటక విధానసభను, ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆల్ బదర్కు చెందిన ఇద్దరు పాకిస్థానీలను అరెస్టు చేయడంతో ఆ కుట్రకు సంబంధించిన వివరాలు తెలిశాయి. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల అనంతరం మైసూర్లో ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు. దీంతో పెద్ద కుట్ర భగ్నమైనట్లు పోలీసులు చెప్పారు.
వాహనాల తనిఖీ సందర్భంగా మొహ్మద్ హుస్సేన్, మొహ్మద్ ఫహాద్ అనే ఇద్దరు ఉగ్రవాదులు మోటార్ బైక్పై పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులకు, వారికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు స్వల్పంగా గాయపడ్డారు. వారి నుంచి పోలీసులు రాష్ట్ర సెక్రటేరియట్ విధానసభ, కొత్తగా నిర్మించిన వికాస్ సౌధ భవనాల చిత్రపటాలు, పాకిస్థాన్లోని, జమ్మూకాశ్మీర్లోని నెంబర్లకు కలిపి వుంచిన ఒక శాటిలైట్ ఫోన్ను, ఒక లాప్టాప్ను, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి వాడే రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఎకె 47ను, విదేశీ తయారీ పిస్టల్ను, డెటనేటర్లను, డిజిటల్ కెమెరాను, పాస్పోర్టులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.