శాసనమండలి అన్ని సీట్లకు పోటీ: వెంకయ్య
విజయవాడ: రాష్ట్ర శాసనమండలి అన్ని సీట్లకూ తాము పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. శాసనమండలి ఏర్పాటు సమంజసమైందని తాము భావిస్తున్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మేధావులు, ప్రముఖులు వస్తారు కాబట్టి శాసనసమండలిలో అర్థవంతమైన, అవగాహనతో కూడిన చర్చలు జరుగుతాయని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము కట్టుబడి వున్నామని ఆయన మరోసారి చెప్పారు. ఆంధ్రా, తెలంగాణ విడిపోతే రెండు ప్రాంతాలకూ మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్ల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని ఆయన అన్నారు.
పార్లమెంటుపై దాడి కేసులో నేరస్థుడు అఫ్జల్ గురుకు మరణశిక్షను అమలు చేయడంలో ఐక్య ప్రగతిశీల కమిటీ (యుపిఎ) జాప్యం చేయడాన్ని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అఫ్జల్కు మరణశిక్ష అమలు చేసే విషయంలో యుపిఎ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని వచ్చే శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. ఈ అంశంపై వచ్చే నెల 15 నుంచి 21వ తేదీ వరకు దేశంలోని 15 కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. నవంబర్ 22వ తేదీన పార్లమెంటు ముందు ప్రదర్శన నిర్వహిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
