తెలంగాణను మోసం చేసింది కాంగ్రెస్సే: గద్దర్
హైదరాబాద్: తెలంగాణను మోసం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై సికింద్రాబాద్లోని పిజి కళాశాలలో సోమవారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని ఓట్ల రాజకీయాలకు అప్పగించడం వల్ల వంచనకు గురయ్యామని ఆయన అన్నారు.
ఆనాటి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు, ఇప్పటి సోనియా గాంధీ తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. కరీంనగర్ జిల్లాను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి ఉద్యమాన్ని అణచివేసింది కూడా కాంగ్రెసేనని ఆయన అన్నారు. కమిటీల, కమీషన్ల నివేదికలు తెలంగాణకు అనుకూలంగా వున్నా న్యాయం జరగడం లేదని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. తన 18వ యేడు నుంచి తెలంగాణ సాధన కోసం పోరాడుతున్నానని, జీవించి ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడుతానని ఆయన చెప్పారు.