తీరం దాటిన తుఫాను: ఐదుగురు మృత్యువాత
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణకోస్తా అతలాకుతలమైంది. తుఫాను తాకిడికి ఐదుగురు మృత్యువాత పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బాపట్లకు 25 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. వాయుగుండం సోమవారం సాయంత్రం ఒంగోలు, బాపట్లల మధ్య తీరం దాటింది. ఇది మరింత బలహీనపడి ఉత్తర వాయవ్య దిశగా పయనించే అవకాశం వుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం వుంది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లోనూ పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుందని విశాఖపట్నంలో వాతావరణపరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నంలో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని పది గ్రామాలకు ఒంగోలుతో సంబంధాలు తెగిపోయాయి. ఇదే జిల్లా అల్లూరు చెరువుకు గండి పడింది. ప్రకాశం జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కారంచేడు మండలంలో ఐదు వేల ఎకరాల పంటలు నీట మునిగిపోయాయి. విజయవాడ, తిరుపతి మధ్య పలు రైళ్లు నిలిచిపోయాయి.
ప్రకాశం జిల్లాలో 70 మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. చీరాలలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రేపల్లె వద్ద రైల్వే ట్రాక్పై నీళ్లు నిలిచాయి. కళింగపట్నం, మచిలీపట్నం, కాకినాడ ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పంట కాలువలు పొంగిపొర్లుతన్నాయి. అవనిగడ్డలో నీరు నిలిచిపోతున్నది. కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. మచిలీపట్నంలో మోకాలు లోతు నీరు చేరింది. ప్రకాశం జిల్లా పొపిరాల ఎత్తిపోతల వద్ద పది మంది చిక్కుపడ్డారు. రేపల్లె సమీపంలోని వారిధి అప్రోచ్రోడ్డుకు గండి పడింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తుఫాను భారీ నష్టం కలుగజేసింది.