రాహుల్ ప్రధాన కార్యదర్శి: ఎపికి వీరప్పమొయిలీ
న్యూఢిల్లీ: సోనియా గాంధీ కుమారుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయనకు యూత్ కాంగ్రెస్, పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా నిరంతరం మాట్లాడుతున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ ఎఐసిసి కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా ముఖ్యమంత్రికి అండదండలు అందిస్తున్న దిగ్విజయ్ సింగ్ ను ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీగా వీరప్ప మొయిలీ నియమితులయ్యారు.
నాలుగు రాష్ట్రాలకు పిసిసి కొత్త అధ్యక్షులను కూడా ఎఐసిసి నియమించింది. పిసిసి అధ్యక్షులుగా పంజాబ్ కు రాజేందర్ కౌర్ భట్టల్, రాజస్థాన్ కు సి.పి. జోషీ, ఉత్తరప్రదేశ్ కు రీటా బహుగుణ, ఉత్తరాఖండ్ కు యశ్ పాల్ ఆర్య నియమితులయ్యారు. త్వరలో కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ విస్తరణలో యువతకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జి. వెంకటస్వామి, కిశోర్ చంద్రదేవ్ లను సిడబ్ల్యుసిలోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు ఎన్. జనార్దన్ రెడ్డికి సిడబ్ల్యుసి శాశ్వత సభ్యుడి హోదా కల్పించారు.












Click it and Unblock the Notifications