సామాజిక సేవకు పవన్ కళ్యాణ్ సంస్థ
హైదరాబాద్: మెరుగైన సమాజం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సినీ నటుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. దాని పేరును కూడా ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్సు పేరుతో ఈ సంస్థ పని చేస్తుందని ఆయన చెప్పారు. దానికి ఆయన కోటి రూపాయల విరాళం కూడా ప్రకటించారు. తనకు దాదాపు పది వేల మంది అభిమానులున్నారని, వారి సహకారంతో సామాజిక సేవ చేస్తున్నానని ఆయన అన్నారు. పాలమూరు జిల్లా ఆకలి చావులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు వంటి సామాజిక సమస్యలు తనను నిరంతరం కలవరపెడుతున్నాయని, గత 20 ఏళ్లుగా సమాజంలో బాధపడుతున్నవారిని చూసి కలత చెందుతున్నానని, అటువంటి వారికి సహాయం చేయడానికి ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.
తనకు బతకడానికి కావలసినంత డబ్బు ఉందని, అయితే తనకు సంతృప్తి కలగడం లేదని, తెలియని బాధ ఏదో ఉంటూనే ఉన్నదని, ఏదో వెలితి ఉంటోందని, అందుకే సామాజిక సేవ చేయాలనే నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. తనకు కులం, మతం, ప్రాంతం లేదని, భారత పౌరుడిగా సామాజిక సేవ చేయాలనేదే తన ఉద్దేశమని, దీనికి మరే కారణాలూ లేవని ఆయన అన్నారు. సామాజిక సేవ చేయాలంటే రాజకీయాలే అవసరం లేదని, రాజకీయాలతో సంబంధం లేకుండానే తాను ఈ సేవా కార్యక్రమం చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
