బ్రాహ్మణి స్టీల్స్ జనార్దన్ రెడ్డి ఇంటిలో ఐటి సోదాలు
బెంగుళూర్: ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దన్ రెడ్డి కార్యాలయాలపై, ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారులు శుక్రవారంనాడు దాడులు చేశారు. కర్ణాటకలోని బళ్లారిలో గల ఆయన కార్యాలయాలపై, ఇంటిపై వారు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో జనార్దన్ రెడ్డి గుల్బర్గాలోని ఒక ఉత్సవంలో పాల్గొంటున్నారు.
దాదాపు వంద మంది ఆదాయం పన్ను శాఖ సిబ్బంది పోలీసుల భద్రతతో ఈ దాడులు నిర్వహించారు. జనార్దన్ రెడ్డి ఓబులాపురం గనులకు, బ్రాహ్మణి స్టీల్స్ కు అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో ఎనేబుల్ ఇండియా అనే సంస్థ కూడా నడుస్తోంది. బ్రాహ్మణి స్టీల్స్ పై, ఓబుళాపురం గనులపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అక్రమంగా లాభం చేకూర్చి పెట్టిందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆందోళనలు కూడా నిర్వహించింది