సోనియాతోనే తేల్చుకుంటాం: తెలంగాణ నేతలు
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రాంతీయ సమన్వయ కమిటీ (టిర్సీసిసి) నాయకులు నిర్ణయించుకున్నారు. రెండో ఎస్సార్సీపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు నివాసంలో వారు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీకి కేశవరావు శుక్రవారం అల్పాహార విందు ఇచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామి ఇచ్చిన అల్పాహార విందుకు హాజరై వీరప్పమొయిలీ కేశవరావు నివాసానికి వచ్చారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, పిసిసి తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు కూడా కేశవరావు ఇంటిలోని అల్పహార విందుకు హాజరయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వి. హనుమంతరావు, ఎం. సత్యనారాయణరావు, వి. పురుషోత్తమరెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పి. జనార్దన్ రెడ్డి, కె. జానారెడ్డి, మధుయాష్కీ గౌడ్, అమోస్ కేశవరావు నివాసంలో సమావేశానికి హాజరయ్యారు. రెండో ఎస్సార్సీ అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెసును నమ్మరేమోనని వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణపై కొన్ని పార్టీలు అనవస రాద్ధాంతం చేస్తున్నారని మధుయాష్కి గౌడ్ అన్నారు. తెలంగాణపై వీరప్పమొయిలీకి స్పష్టమైన అవగాహన ఉందని, ఈ విషయంలో అపోహలు అవసరం లేదని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లో తెలంగాణపై తాము ముందుకు వస్తామని కేశవరావు అన్నారు.