కర్ణాటకలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
న్యూఢిల్లీ: రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న కర్ణాటకలో విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీజేపీ- జేడీఎస్ కూటమి కర్ణాటకలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర మంత్రివర్గం కర్ణాటకలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది.
రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని నిర్ణయించడంతో భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దీంతో పలు అనూహ్య మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. కర్ణాటక గవర్నర్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై రెండు రోజుల క్రితం కేంద్రానికి తుది నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలించిన కాబినెట్ రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.
బీజేపీతో రెండేళ్ల క్రితం కుదుర్చుకున్న అధికార బదిలీ ఒప్పందానికి జేడీఎస్ కట్టుబడకపోవడంతో గత నెలలో జేడీఎస్- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కర్నాటకలో రాష్ట్రపతి పాలను విధించింది. అయితే కర్నాటకలో అధికారంలోకి రావడానికి బీజేపీ తన ప్రయత్నాలను మాత్రం వదిలిపెట్టలేదు. జేడీఎస్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిస్తామని ప్రకటించడంతో కర్నాటక రాజకీయాలు ఇటీవల ఊహించని మలుపు తిరిగాయి.
అయితే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ జాప్యం బీజేపీని కంగారుపెట్టింది. ఇదిలా ఉంటే మద్దతిస్తున్న జేడీఎస్లోని ఒక వర్గం బీజేపీతో కలసి ప్రభుత్వంలో పాలుపంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ పార్టీలో చీలక వచ్చింది. అయితే తగినంత మంది సభ్యులు బలం ఉన్న కారణంగా కర్ణాటక రాజకీయాలను బీజేపీ ఢిల్లీ వీధులకు చేర్చింది. మంగళవారం తమకు మద్దతిచ్చే శాసనసభ్యులందరితో రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications
