రాజీనామాను ఉపసంహరించుకోను: వంగవీటి రాధ
విజయవాడ: శాసనసభ సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. హైదరాబాదు నుంచి ఆయన శుక్రవారంనాడు విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. తమ పార్టీ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూకు కేటాయించిన 120 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని వెనక్కి తీసుకోవాలని, విజయవాడలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈ రెండు డిమాండ్లను నెరవేర్చే వరకు తాను రాజీనామాను ఉపసంహకించుకోబోనని ఆయన అన్నారు.
తాను తన పార్టీకి పెద్దలైన ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను సమర్పించానని, ముఖ్యమంత్రి స్పీకర్ కు పంపించుకోవచ్చునని ఆయన అన్నారు. తన బాధ ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తన కుటుంబానికి న్యాయం జరగాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ తన సొంత ఇల్లు అని, నెహ్రూకు అద్దె ఇల్లు అని ఆయన అన్నారు. తెలుగుదేశం వారు గెంటేస్తే నెహ్రూ కాంగ్రెస్ లోకి వచ్చారని ఆయన అన్నారు. నెహ్రూతో కలిసి తాను ఏనాడు తిరగలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
