నేను సమర్థిస్తేనే వైయస్ సిఎం అయ్యారు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తాను సమర్థిస్తేనే వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ అన్నారు. గవర్నర్ పదవి కోసమే తెలంగాణ గురించి మాట్లాడుతున్నట్లు వస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ గురించి మాట్లాడానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కష్టమేనని ఆయన అన్నారు. తాము సోనియా గాంధీని కలిసి పరిస్థితి వివరిస్తామని ఆయన చెప్పారు.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందున తెలంగాణ ఇవ్వలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొన్నానని, దెబ్బలు కూడా తిన్నానని, అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఇవ్వాలనుకుంటే ఇచ్చి ఉండేవారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాదని కాదు, వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారని ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి సమక్షంలో తనతో అన్నట్లు ఆయన తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా ఉన్నప్పటి నుంచి మన్మోహన్ సింగ్ తనకు తెలుసునని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
