'కాగ్' నివేదికపై వైయస్ అసంతృప్తి
కడప: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వివరణను కాగ్ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నిధులు దుర్వినియోగమయ్యాయని, ఆయకట్టు లక్ష్యం మేరకు పెరగలేదని కాగ్ తన నివేదికలో ప్రభుత్వాన్ని తప్పు పట్టింది.
వివరణ ఇస్తూ తాము ఒక నివేదికను పంపామని, దాన్ని కాగ్ తన నివేదికలో పొందుపరచలేదని, దాన్ని పట్టుకుని తెలుగుదేశం పార్టీ వివాదాస్పదం చేస్తోందని ఆయన అన్నారు. ఈ విషయంపై తాను భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో మాట్లాడానని, సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వ వివరణను కాగ్ నివేదికలో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించానని ఆయన చెప్పారు. మంగళవారం తుమ్మలపల్లిలో యురేనియం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఆ తర్వాత బుధవారం ఉదయం వరకు ఇడుపులపాయలో విశ్రాంతి తీసుకున్నారు.