పరిటాల హత్య నేనెరుగ: మొద్దు శీను
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్యతో తనకు ఏ సంబంధమూ లేదని ఆ కేసులో నిందితుడు జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను అన్నాడు. చందానగర్ పేలుడు కేసులో మంగళవారంనాడు అతన్ని పోలీసులు రంగారెడ్డి కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అతను మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి అంటే తనకేం భయం లేదని, తానంటేనే సూరి భయపడుతున్నాడని అతను అన్నాడు.
పరిటాల రవి హత్య విషయంలో వాస్తవాలు ఆ దేవుడికి తెలుసునని, ఆ దేవుడే తనకు న్యాయం చేస్తాడని అతను అన్నాడు. పరిటాల రవి హత్యానంతరం ఒక ప్రైవేట్ తెలుగు టీవీ ఛానెల్ కు రహస్య ప్రదేశంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మొద్దు శీను నేరాన్ని అంగీకరించాడు. మద్దెలచెర్వు సూరిని పొగడ్తలతో ముంచెత్తాడు. బావ సూరి కోసమే తాను పరిటాలను హత్య చేశానని అతను చెప్పాడు.
పరిటాల రవి హత్య తర్వాత అజ్ఢాతంలోకి వెళ్లిన మొద్దు శీను అనూహ్యంగా 2005 నవంబర్ 11వ తేదీన చందానగర్ లో పోలీసులకు చిక్కాడు. చందానగరులోని సుప్రజా లాడ్జిలో బాంబు తయారు చేస్తూ అది పేలడంతో గాయపడి అతను పోలీసులకు దొరికాడు. పరిటాల రవి హత్య తర్వాత అతను ఢిల్లీలో తలదాల్చుకున్నట్లు బయట పడింది.












Click it and Unblock the Notifications
