ఇష్టం లేకున్నా ఎమర్జెన్సీ తప్పలేదు: ముషార్రఫ్
ఇస్లామాబాద్: తనకు ఇష్టం లేకున్నా దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. పాకిస్తాన్ పౌర అధ్యక్షుడిగా ఆయన గురువారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం గాడి తప్పడానికి న్యాయవ్యవస్థదే బాధ్యత అని ఆయన అన్నారు. ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ హమ్మద్ డోగర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముషార్రఫ్ అత్యవసర పరిస్థితి నిబంధనల ప్రకారం కాకుండా పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశారు.
తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమాజంలోని అన్ని వర్గాలవారు రావడం తనను కదిలించిందని ఆయన అన్నారు. ఆర్మీ చీఫ్ గా తాను ప్రతి క్షణం ఆనందించానని, పాక్ సైన్యం ప్రపంచంలోనే గొప్పదని ఆయన అన్నారు. బహిష్కరణ హెచ్చరికలు వచ్చినప్పటికీ పాకిస్తాన్ పార్లమెంటరీ ఎన్నికలు ముందు నిర్ణయించిన ప్రకారం జనవరి 8వ తేదీన జరుగుతాయని ఆయన చెప్పారు. ఆర్మీ చీఫ్ పదవికి ఆయన బుధవారంనాడు రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications
