విపక్షాలకు మంత్రి ఆనం క్షమాపణ
హైదరాబాద్: ప్రతిపక్షాలకు మంత్రి ఆనం వివేకానంద రెడ్డి సోమవారం శాసనసభలో క్షమాపణ చెప్పారు. ప్రతిపక్షాలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఈ క్షమాపణలు చెప్పారు. గృహ కల్ప పథకంపై మాట్లాడుతూ ఆయన ప్రతిపక్షాలపై ఓ వ్యాఖ్య చేశారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజీవ్ గృహకల్ప పథకం ప్రజలకు ఎంతో లాభం చేకూరుస్తోందని అంటూ ప్రజలు ఈ పథకం కింద పొందిన లాభాన్ని వివరించసాగారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో మంత్రి ప్రతిపక్షాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
రెండో సారి కూడా అదే వ్యాఖ్య చేస్తూ తనతో వస్తే రాజీవ్ గృహకల్ప పథకం కింద లబ్ధి పొందినవారిని చూపిస్తానని అన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యకు ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆనం వివేకానందరెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి తప్పు పట్టారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెబుతూ మంత్రి క్షమాపణ చెప్పడంతో సభ సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications