మంత్రులపై కాంగ్రెస్ హైకమాండ్ గుర్రు
హైదరాబాద్: రాష్ట్రంలోని ముగ్గురు మంత్రుల తీరుపై కాంగ్రెస్ అధిష్ఠానవర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా ఇరకాటంలో పెడుతోంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, లఘు పరిశ్రమల మంత్రి గొల్లపల్లి సూర్యారావుల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దివాకర్ రెడ్డిపై గొల్లపల్లి సూర్యారావు తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశంలోనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ఇసుక ర్యాంపు కుంభకోణంలో దివాకర్ రెడ్డికి ఏడు కోట్ల రూపాయలు ముట్టాయని, దీనిపై విచారణ జరిపిస్తే నిరూపిస్తానని గొల్లపల్లి సూర్యారావు ఆరోపించారు. దివాకర్ రెడ్డిపై ఆరోపణలను రుజువు చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం ముఖ్యమంత్రిని ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. ఇది ప్రతిపక్షాలకు అస్త్రం అందించినట్లయింది.
ఈ మంత్రుల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో గొల్లపల్లి సూర్యారావుకు అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అండగా వచ్చారు. ఇసుక ర్యాంపు కుంభకోణం వాస్తవమేనని, అయితే ఎవరు అవినీతి పాల్పడ్డారనే విషయం తనకు తెలియదని అంటూనే ఆయన ముఖ్యమంత్రిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల క్రితం ఈ కుంభకోణంపై తాను కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశానని, ముఖ్యమంత్రికి లేఖలు చదివే అలవాటు లేదని, తన లేఖను కూడా చదవలేదని ఆయన విరుచుకుపడ్డారు. దివాకర్ రెడ్డిపై ఆరోపణలతో ముఖ్యమంత్రిని ఇరకాటంలోకి నెట్టడానికి ఒక వర్గం ప్రయత్నిస్తున్నట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, బిసీలకు వ్యతిరేకంగా మార్కెటింగ్ మంత్రి మారెప్ప చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం లేపాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మారెప్పపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మారెప్పకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిసిలను దగ్గర చేసుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నుంచి బిసిలకు వ్యతేరంగా వ్యాఖ్యలు రావడం నష్టం కలుగజేస్తుందని భావిస్తున్నారు. ఈ విషయం కూడా కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి చేరినట్లు సమాచారం. ముఖ్యమంత్రికి సన్నిహితులైన మంత్రుల తీరును ఒక వర్గం అధిష్ఠానవర్గానికి చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన చెప్పాలని అధిష్ఠానవర్గంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
