ముంబైలో తాజా కాల్పుల వదంతులు
ముంబయి: ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సిఎస్టీ), ఆర్బీఐ క్వార్టర్స్ వద్ద ఉగ్రవాదులు తాజాగా కాల్పులు జరిపినట్లు వదంతులు వ్యాపించాయి. తాజ్, ట్రైడెంట్ హోటళ్లలో, నారిమన్ హౌస్ వద్ద ఉగ్రవాదులతో జాతీయ భద్రతా దళాల కమెండోలు ఎదురు కాల్పులు జరుపుతుండగానే ఈ వదంతులు వ్యాపించాయి. ఈ వదంతులతో సిఎస్టీకి రైళ్ల రాకపోకలను ఆపేశారు. అయితే ఎటువంటి కాల్పులు జరగలేదని రైల్వై అధికారులు స్పష్టం చేశారు. అవి వదంతులు మాత్రమేనని రైల్వే భద్రతా కమీషనర్ ఎకె శర్మ చెప్పారు.
కాగా, ముంబయిలో టీవీ చానెళ్ల ప్రసారాలను ఆపేశారు. సెయింట్ జేవియర్ స్కూల్లోకి ఒక ఉగ్రవాది ప్రవేశించినట్లు కూడా ప్రచారం జరిగింది. కాగా, ప్రజల భయాందోళనలను తొలగించడానికి టెలిఫోన్ శాఖ నగరంలో మొబైల్ జామర్లను ఏర్పాటు చేసింది. పోలీసు పెట్రోల్ పంపును ఏర్పాటు చేశారు. తాజ్ హోటల్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మీడియా ప్రతినిధులపైకి కూడా ఉగ్రవాదులు గురి పెట్టారు. ఒబెరాయ్ హోటల్లో నుంచి 148 మందిని ఎన్సీజీ కమెండోలు విడిపించారు. నారిమాన్ హౌస్ మూడో అంతస్థులో కమెండోలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.