అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం
హైదరాబాద్ : శాసనసభ శీతాకాల సమావేశాలకు అధికార,విపక్షాలు సన్నద్ధమయ్యాయి. సమావేశాల ఎజెండాను ఖరారు చేసేందుకు సభా వ్యవహారాల సలహాసంఘం (బిఎసి) స్పీకర్ కార్యాలయంలో సమావేశమైంది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు అన్నీ రాజకీయపక్షాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. రేపు ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. సమవేశాలను 15 రోజుల పాటు నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే విపక్షాల ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఒక్క రోజు కూడా సమావేశాలను పొడిగించడం కుదరదని స్పష్టం చేసింది. గోదావరిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న అక్రమప్రాజెక్టులతో పాటు కోస్తా కారిడార్, రైతాంగసమస్యలు, సాగునీటిప్రాజెక్టులకు నిధుల కొరత, సంక్షేమరంగంలో నిధుల దుర్వినియోగంపై సభలో చర్చకు వచ్చేలా చూడాలని విపక్షాలు సభాపతి సురేష్రెడ్డికి విజ్ఞప్తి చేశాయి.
తొలి రోజు శాసనసభ మాజీ ప్రధాని విపి సింగ్ మృతికి, ముంబయి దాడుల మృతులకు సంతాపం ప్రకటిస్తుంది. రెండో రోజు గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకుంటే ఐదు రోజుల సమావేశాలు సరిపోతాయని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య అన్నారు. అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తాను ఎజెండా ప్రకారం సభను నడుపుతానని స్పీకర్ కె. సురేష్ రెడ్డి చెప్పారు. తనకు సహకరిస్తామని అన్ని పార్టీలు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
సోమవారం నుంచి ప్రారంభం కానున్న విధానసభ సమావేశాలకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబయిపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీలు చేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా విధానసభకు కిలోమీటరు పరిధిలో ఎక్కడా సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications
