బాసరలో వసంత పంచమి వేడుకలు
ఆదిలాబాద్: చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలకు ఆదిలాబాద్ జిల్లాలోని బాసర ముస్తాబైంది. శనివారం వేకువజామున ఒకటిన్నర గంటలకు మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని వూరేగిస్తారు.
ఈ పంచమిని చిన్నారుల అక్షరాభ్యాసానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలలనుంచే కాక ఇతర రాష్ట్రాలనుంచి కూడా భారీగా భక్తులు తరలిరావటంతో బాసర కిటకిటలాడుతోంది. ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లు ఏర్పాటుచేసి పెద్దవారికి నీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయం ఈఓ తెలిపారు. అన్నదానం, వైద్యసౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్సీసీ సేవలను కూడా ఉపయోగించుకుంటున్నామని తెలిపారు.