భారత్ లో ఆ 3 ప్రాంతాలూ మావే..! కానీ పత్రాల్లేవు..! నేపాల్ షాకింగ్ ..!
నేపాల్ (Nepal)లో జెన్ జీ తిరుగుబాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బాలేన్ షా ప్రభుత్వం భారత్ (India)ను చికాకుపెడుతోంది. ముఖ్యంగా పాత వివాదాల్ని తవ్వితీసి ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై స్వదేశంలో వ్యతిరేకత వస్తున్నా లెక్కచేయడం లేదు. ఇదే క్రమంలో భారత్ లోని మూడు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమనే వాదనను తెరపైకి తెచ్చింది. అంతే కాదు తమ వాదన వెనుక చారిత్రక ఒప్పందం ఉందని వాదిస్తోంది. అయితే ఆ ఒప్పందం పత్రాలు బహిర్గతం చేయమని ప్రశ్నిస్తే గాలించాం, కానీ దొరకలేదంటోంది. దీంతో భారత్ కు ఇదో తలనొప్పిగా మారబోతోంది.
భారత్-నేపాల్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి 210 ఏళ్ల చరిత్ర ఉంది. 1816లో బ్రిటీష్ ఇండియాతో కుదుర్చుకున్న సుగౌలీ ఒప్పందం (Sugauli Treaty) ప్రకారం భారత్ లోని లిపులేఖ్, కాలాపాని, లింపియాథుర ప్రాంతాలు తమవేనని వాదిస్తోంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన అసలు పత్రాలు మాత్రం ఎక్కడ ఉన్నాయో తమకు ఖచ్చితంగా తెలియదని చెబుతోంది. ఇదే విషయాన్ని ఇవాళ నేపాల్ పార్లమెంట్ కు కూడా అక్కడి బాలేన్ షా ప్రభుత్వం చెప్పేసింది. తాజాగా తమ పార్లమెంట్ విచారణ కోసం ఆర్కైవ్ లు, వివిధ మంత్రిత్వశాఖలు, మ్యూజియాల్లోనూ ఈ పత్రాల కోసం గాలించినా దొరకలేదని పేర్కొంది.

ఇరుదేశాల సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్, లింపియాధుర, కాలాపాని ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తుండగా.. భారత్ మాత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగమని వాదిస్తోంది. భారత్- నేపాల్ మధ్య ఈ సరిహద్దు వివాదానికి మరో ప్రధాన కేంద్రం కాళి లేదా మహాకాళి నది. ఇది ఎక్కడ పుడుతుందనే దానిపై ఉన్న భిన్నమైన వాదనలపైనే ఈ వివాదం ఆధారపడి ఉంది. ఎందుకంటే సుగౌలీ ఒప్పందం కాళీ నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా చేసింది. 2020లో తన ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఈ ప్రాదేశిక వివాదాన్ని ఒక పెద్ద జాతీయవాద సమస్యగా మార్చారు. వివాదాస్పదమైన మూడు ప్రాంతాలను కలుపుకొని ఒక కొత్త రాజకీయ పటాన్ని ప్రచురించి, రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటులో ఆమోదించారు. ఈ కృత్రిమ విస్తరణను భారత్ తోసిపుచ్చింది. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.














Click it and Unblock the Notifications