ఆర్వీకి అసెంబ్లీ సంతాపం
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ మృతి పట్ల రాష్ట్ర శాసనసభ మంగళవారం సంతాపం తెలిపింది. ఆర్ వెంకట్రామన్ దేశానికి చేసిన సేవలను అధికార, విపక్ష పార్టీలు కొనియాడాయి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆర్వీ ఆలోచనలు, సిద్ధాంతాలు అనుసరణీయమని ముఖ్యమంత్రి అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడుగా, ఆర్థిక నిపుణుడిగా, రచయితగా మాజీ రాష్ట్రపతి ఆర్వీ బహుముఖ ప్రజ్ఞశాలి అని తెలుగుదేశం సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారని అన్నారు.వివాదాలకు అతీతుడిగా, అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అయిన వ్యక్తి ఆర్వీ అని ఆర్థిక శాఖ మంత్రి రోశయ్య ప్రశంసించారు. రాష్ట్రపతిగా ఆర్వీ నలుగురు ప్రధానులతో కలిసి పనిచేశారని, సంక్షోభ సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించారని అన్నారు. ఆర్వీ స్ఫూర్తితో అందరూ పనిచేయాలని ఆయన అన్నారు.