హైదరాబాద్: అన్ని పార్టీలు మహిళలను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయని పీఆర్పీ అధినేత చిరంజీవి ఆరోపించారు. హైదరాబాద్లోని పీఆర్పీ కార్యాలయంలో జరిగిన పార్టీ మహిళా విభాగం...మహిళా రాజ్యం రాష్ట్ర కమిటీ ప్రమాణస్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలే ప్రజారాజ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల అభ్యన్నతి కోసం పాటుపడేది ప్రజారాజ్యమేనని చిరంజీవి స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని పార్టీ అధినేత చిరంజీవి వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని మహిళలు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని చిరంజీవి విమర్శించారు. విద్యార్థినులు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై వేగంగా స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని చిరు మహిళా కార్యకర్తలకు సూచించారు.