1091..ఆడవారి ఆయుధం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 1091 టెలిఫోన్ నెంబర్ ను ప్రచారంలోకి తీసుకుని రావడంతో పాటు..డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగంలో సెంట్రల్ కంట్రోల్ రూం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఐడీ విభాగానికి చెందిన ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉన్నతాధికారులతో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు.
వరంగల్ లో యాసిడ్ దాడి ఘటన తర్వాత, వేధింపులకు గురవుతున్న మహిళలకోసం ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ కు తుది మెరుగులు దిద్ది రాష్ట్రవ్యాప్తంగా 1091 నెంబర్ ను ప్రచారంలోకి తీసుకుని రావడానికి హోం మంత్రిత్వ శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో 1091 నెంబర్ అమల్లో ఉన్నప్పటికి, సరైన ప్రచారం లేకపోవడం, ఫిర్యాదుల స్వీకరణలో ఇబ్బందులు దృష్ట్యా ఆశించిన ఫలితాలు రావడం లేదని ప్రభుత్వం భావించినట్లు సమాచారం.