శ్రీవారికి రూ.45 కోట్ల వజ్ర కిరీటం
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి మరో వజ్రకిరీటం అందుతుంది. కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్దనరెడ్డి వజ్రకిరీటాన్ని గురువారం రాత్రి శ్రీవారికి బహూకరించనున్నారు. ఈ మేరకు ఆయన భారీ భద్రత మధ్య వజ్రకిరీటంతో బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్ర వైద్య శాఖ మంత్రి శ్రీరాములు కూడా వారితో వచ్చారు. రూ.45 కోట్లు విలువైన ఈ కిరీటాన్ని కార్మికులు తొమ్మిది నెలల పాటు శ్రమించి రూపొందించారని దాత తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులకు వివరించారు.
ఇద్దరు మంత్రులు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులతో తలచిన పనులు సక్రమంగా జరుగుతుండడం, బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం విజయవంతంగా నిర్మాణమవుతున్న తరుణంలో శ్రీవారికి కానుకగా వజ్రకిరీటం ఇస్తున్నట్లు గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. కిరీటం విలువను బహిరంగంగా చెప్పడానికి ఆయన నిరాకరించారు.