బాబుతో చిరు పార్టీ పొత్తు?
తెలుగుదేశం, వామపక్షాలతో ప్రరాపా కలిసి పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుచుకోవచ్చని పలువురు నేతలు చిరంజీవికి సూచించినట్లు సమాచారం. అయితే తెలుగుదేశంతో కాకుండా ముందుగా ఇతర విపక్ష పార్టీలతో పొత్తు విషయమై చర్చించాలని చిరంజీవి భావిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు ఉపేంద్ర, దేవేందర్గౌడ్, గంటా శ్రీనివాసరావు, మనోహర్ తదితరులు గురువారం చిరంజీవితో భేటీ అయినప్పుడు దీనిపై కొంత చర్చ జరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం, వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం మేలని దేవేందర్గౌడ్ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన కొందరు ద్వితీయశ్రేణి వామపక్ష నేతల వద్ద ప్రస్తావించగా వారు సుముఖత చూపారని వినికిడి.
ఇటీవలి ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్, తెదేపాల మధ్య ఓట్ల తేడా రెండు లక్షలేనని, అదే సమయంలో ప్రరాపాకి పోలయిన ఓట్లు 4 లక్షలకుపైగా ఉన్నాయని సమావేశంలో చర్చకు వచ్చింది. తెదేపా, ప్రరాపా, వామపక్షాలు కలిసి పోటీచేస్తే తిరుగుండదని, తద్వారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించవచ్చని నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. లోక్సత్తా, భాజపాలతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని కొందరు నేతలు సూచించారు. మరికొందరు మాత్రం తెదేపా, భాజపాలను పక్కనపెట్టి వామపక్షాలు, లోక్సత్తాతో కలిసి పోటీచేద్దామంటూ మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిపై గ్రేటర్ పరిధిలోని నేతలతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొందరు ముఖ్య నేతలతో కూడిన బృందాలను పంపాలని, తద్వారా ఇటీవలి ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను, గెలుపోటములను విశ్లేషించుకోవాలని పార్టీ నిర్ణయించింది.