భారత్ విజ్ఞప్తి అందలేదు: పాక్
ఇస్లామాబాద్: ముంబై దాడుల కేసులో నిందితులను అప్పగించాలని భారత్ నుంచి తమకు ఎటువంటి విజ్ఞప్తి అందలేదని పాకిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి బుధవారం చెప్పారు. ముంబై దాడులతో ప్రమేయం ఉన్న 22 పాకిస్తానీలపై మంగళవారం భారత కోర్టు అరెస్టు వారంట్లు జారీ చేసింది. ముంబై దాడుల కేసులో అనుమానితులను తమకు అప్పగించాలని భారత ప్రాసిక్యూటర్లు పాకిస్తాన్ ను డిమాండ్ చేశారు.
భారత్, పాక్ ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందమేదీ లేదని, ముంబై దాడుల కేసులో అనుమానితులను అప్పగించాలని భారత్ నుంచి తమకు ఏ విధమైన లేఖ అందలేదని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ బాసిత్ అన్నారు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మొహమ్మద్ సయీద్, జకీ - ఉర్ - రహ్మాన్ లక్వీ, జరార్ షాలను తమకు అప్పగించాలని భారత్ కోరుతోంది. నేరం జరిగిన చోట వీరెవరూ లేరని బాసిత్ ఒక న్యూ ఏజెన్సీతో అన్నారు.
దాడుల జరిగిన మొదటి రోజు నుంచే తాము సహకరిస్తున్నామని, తాము కొంత మందిని అరెస్టు చేశామని, వారు కటకటాల వెనకే ఉన్నారని, వాయిదాల పద్ధతిలో కాకుండా తమకు సంబంధిత పూర్తి సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.