దాడి మృతుల్లో భారతీయులే ఎక్కువ
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థులపై జరుగుతున్న దాడుల్లో మృతులు ఎక్కువ మంది భారతీయులేనని తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో గత ఏడాది దౌర్జన్యకారుల దాడుల్లో 54 మంది వరకు విదేశీ విద్యార్థులు మృతి చెందగా అందులో 25 మంది భారతీయులేనని ఒక పత్రిక తెలిపింది. ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయులపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్న తరుణంలో ఈ సంఘటనలపై మరో సంచలన కథనాన్ని ఆస్ట్రేలియా ప్రముఖ దినపత్రిక 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' ప్రచురించింది.
నవంబర్ 2007నుంచి 2008 నవంబర్ వరకు మృతుల సంఖ్యను ప్రభుత్వం నుంచి ఆ పత్రిక సేకరించి ఈ కథనాన్ని ప్రచురించింది. పార్లమెంటులో ఈ దాడులపై విపక్షాలు ప్రశ్న లేవనెత్తగా చనిపోవటానికి కారణాలు తెలియరాలేదని ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని రాసింది. ప్రభుత్వలెక్క ప్రకారమే మృతుల సంఖ్య 54దాకా ఉందని వాస్తవానికి ఆ సంఖ్య మూడింతలు ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నట్లు రాసింది. భారతీయ విద్యార్థుల అనంతరం ఎక్కువగా మృతి చెందినవారి సంఖ్య చైనా, కొరియా విద్యార్థులదని ఆ పత్రిక పేర్కొంది. ఆస్ట్రేలియాకు విదేశీ విద్యార్థుల వల్ల పెద్దమొత్తంలో వస్తున్న ఆదాయాన్ని పొగొట్టుకోవటం ఇష్టం లేకే ప్రభుత్వం ఈ మరణాలకు కారణాలు వెల్లడించటం లేదన్నారు. విద్యాసంస్థలు కూడా తమ సంస్థలోని విదేశీ విద్యార్థులు మృతి చెందితే అందుకు కారణాలు ప్రభుత్వ శాఖలకు తెలియజేయటం లేదన్నారు.