సోనియా చలించిపోయారు: రోశయ్య
కర్నూలులో ఒండ్రు మట్టి మేటలను తొలగించేందుకు సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని, అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని ఆయన చెప్పారు. కర్నూలు విచిత్రమైన పరిస్థితి ఉందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన వరదల సందర్భాల్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని ఆయన అన్నారు. కర్నూలులో 10 నుంచి 25 అడుగుల మేర ఒండ్రుమట్టి మేటలు వేసిందని, వాటిని తొలగించడం చాలా కష్టంగా ఉందని, అవి ఎండిపోవడంతో తొలగించడం కష్టంగా మారిందని, వాటిని నీళ్లలో నానబెట్టి తొలగించాల్సి వస్తోందని ఆయన అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్ర పర్యటన వివరాలను ఆయన మీడియా ప్రతినిధులకు వివరించారు. రేపు సాయంత్రం ప్రధాని హైదరాబాదులోనే బస చేస్తారని, మర్నాడు కర్నాటక వరద తాకిడి ప్రాంతాల పర్యటనకు వెళ్తారని ఆయన చెప్పారు.
వరద తాకిడి ప్రాంతాల్లో పరిస్థితిలు చక్కబడ్డాక తాను పర్యటనలు చేస్తానని ఆయన చెప్పారు. వరద బాధితులకు అదనంగా 5 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు, 20 వేల కిలో లీటర్ల కిరోసిన్ ఇవ్వాలని రోశయ్య పెట్రోలియం శాఖా మంత్రి మురళీ దేవరాను కోరారు. ఈ మేరకు ఆయన మురళీ దేవరాకు గురువారం ఓ లేఖ రాశారు.