హర్యానాలో కాంగ్రెసుకు గవర్నర్ పిలుపు
హర్యానా శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఆరుగురు కాంగ్రెసుకు మద్దతిస్తూ లేఖలు అందజేసే ఆవకాశం ఉంది. ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా గవర్నర్ ను కలిసే కాంగ్రెసు బృందానికి నేతృత్వం వహిస్తారు. ఏడో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రహ్లాద్ సింగ్ తాను ఎవరికీ మద్దతిచ్చేది తెలియజేయలేదు. అయితే ఆయన కూడా కాంగ్రెసుకే మద్దతిచ్చే అవకాశం ఉంది.
హుడానే తిరిగి ముఖ్యమంత్రి అవుతారా, లేదా అనే విషయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు తేల్చి చెప్పలేదు. కేంద్ర మంత్రి షెల్జా, హర్యానా అటవీ, పర్యాటక శాఖల మంత్రి కిరణ్ చౌదరి, విద్యుచ్ఛక్తి మంత్రి రణదీప్ సుర్జేవాలా పేర్లు ముఖ్యమంత్రి పదవి కోసం వినిపిస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర కాంగ్రెసు నాయకులు హర్యానా జనహిత్ కాంగ్రెసు నేత కులదీప్ బిష్ణోయితో కూడా చర్చలు జరుపుతున్నారు. ఏడుగురు స్వతంత్రులు, ఆరుగు జనహిత్ కాంగ్రెసు సభ్యులు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారు. హెచ్జెసి హుడాను ముఖ్యమంత్రిగా అంగీకరించే అవకాశాలు లేవు. అదే సమయంలో బిష్ణోయికి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా డిమాండ్ చేసే అవకాశాలున్నాయి.
కాగా, 31 సీట్లు గెలుచుకున్న చౌతాలా నాయకత్వంలోని ఐఎన్ఎల్డీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తోంది. మిత్ర పక్షం అకాలీదళ్ కు ఒక సీటు వచ్చింది. అవసరమైతే బిజెపి కూడా ఐఎన్ఎల్టీకి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఈ స్థితిలో చౌతాలా హర్యానా జనహిత్ కాంగ్రెసు నేత బిష్ణోయితో సంప్రదింపులు జరుపుతున్నారు.