ఎమ్మెల్యే సీతారెడ్డి కోసం 5 పోలీసు దళాలు
వ్యవసాయాధికారి రాజేశ్వరి ఆత్మహత్య కేసులోటీడీపీ ఎమ్మెల్యే సీతాదయాకరరెడ్డి పేరును అన్యాయంగా ఇరికించారని, ఆమె పేరును ఆ కేసు నుంచి తొలగించేలా చూడాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. టీడీఎల్పీ తరఫున ఎమ్మెల్యేలు నాగం జనార్ధనరెడ్డి, వేణుగోపాలాచారి, ఉమామాధవ రెడ్డి, సత్యవతి రాథోడ్ శుక్రవారం స్పీకర్ ను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందచేశారు. అధికారి ఆత్మహత్యతో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోయినా పోలీసులు అన్యాయంగా ఆమెను ఇరికించారని వారు ఆరోపించారు.
'రాజేశ్వరి ఈ నెల 15న ఒకసారి, 17న ఒకసారి మరణ వాంగ్మూలం ఇచ్చింది. చివరగా 17వ తేదీన ఆమె ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని హైదరాబాద్లో ఒక మేజిస్ట్రేట్ నమోదు చేసుకొన్నారు. ఎమ్మెల్యే తనను బెదిరించలేదని, కేవలం విజ్ఞప్తి చేశారని రాజేశ్వరి అందులో చెప్పారు. ఆమె ఆత్మహత్యకు కారణమైనట్లుగా ఎమ్మెల్యే తీరు ఎక్కడా లేకపోయినా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు' అని వారు వివరించారు. దీనిపై ప్రభుత్వం నుంచి సమాచారం తెప్పించుకొంటానని స్పీకర్ వారికి చెప్పారు.