మావోయిస్టులకు విదేశీ ఆయుధాలు: చిదంబరం
చర్చలకు ముందస్తు షరతుగా ఆయుధాలు కింద పడేయాలని తాము చెప్పడం లేదని చిదంబరం అన్నారు. "హింసను ఆపాలని వారిని కోరడమంటే..రైల్వే ట్రాకులు, రోడ్లు, టెలిఫోన్ టవర్లు, పాఠశాల భవనాలు, వంతెనలను ధ్వంసం చేయడాన్ని, కిడ్నాప్లు, అక్రమ వసూళ్లను ఆపాలనడం" అని చెప్పారు. మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన మేధావులపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయుధాలు, డబ్బు కోసమే తాము బెంగాల్లోని పోలీస్ స్టేషన్ పై దాడి చేసినట్లు మావోయిస్టులు ప్రకటించిన అంశాన్ని ఆయన గుర్తు చేస్తూ...ఈ ప్రకటన తర్వాత కూడా ఎవరైనా నక్సలైట్ల అంశాన్ని గోరంతలు కొండంతలు చేయాలనుకుంటే వారిని దేవుడే కాపాడాలని అన్నారు.
మావోయిస్టు మహిళా ఖైదీల విడుదల అంశంలో బెంగాల్ ప్రభుత్వ వైఖరిపై తాను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని అన్నారు. మావోయిస్టులకు పాక్ నుంచి ఆయుధాలు అందుతున్నాయా? అన్న ప్రశ్నకు..కచ్చితంగా చెప్పలేమని అన్నారు. విదేశాల్లో మావోయిస్టులకు మద్దతిచ్చే సంస్థలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు...తనకు తెలియదని జవాబిచ్చారు. అయితే కొందరు మేధావులు వారికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అన్నారు. మావోయిస్టులతో నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించి..వారిని చర్చలకు అంగీకరింప చేసేందుకు 'విభిన్నమైన ఆలోచన' ఏమైనా చేస్తున్నారా? అన్న ప్రశ్నకు.. "ఎలాంటి సందిగ్ధం లేదు. వామపక్ష తీవ్రవాదం గురించి లేనిపోని ఊహాగానాలు చేస్తున్న వారే సందిగ్ధం ఉందని అంటున్నారు" అన్నారు.