రోశయ్య వైపు ప్లేటు ఫిరాయింపు

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ డిమాండ్ పెట్టిన కొంత మంది మంత్రులు తమది డిమాండ్ కాదు, కోరిక మాత్రమేనని చెప్పి సర్దుకునే ప్రయత్నం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి రోశయ్య నాయకత్వంలో రైతులకు తాము చేరువ అవుతామని చెప్పి తన విధేయతను ప్రకటించుకునే ప్రయత్నం చేశారు. నిజానికి, మంత్రివర్గంలో చాలా మంది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అనుయాయులు. దీంతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం మేరకు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోశయ్యను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. పార్టీ శాసనసభ్యులు కొంత మంది రోశయ్యకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. అయితే క్రమక్రమంగా గొంతు తగ్గిస్తూ వెనక్కి తగ్గుతూ వచ్చారు.
పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ కూడా మాట తీరు కూడా మారింది. కాంగ్రెసు పథకాలనే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని అన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపట్టిన పథకాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయని వైయస్ జగన్ ప్రకటనకు దీన్ని విరుగుడుగా భావించవచ్చు. ఒక్కరొక్కరే ప్లేటు ఫిరాయిస్తూ రోశయ్యకు మద్దతు పలుకుతుండడం జగన్ వర్గాన్ని కలవర పరుస్తోంది.












Click it and Unblock the Notifications