తల్లిదండ్రులకు శుభవార్త.. 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, LKG, UKG (ప్రీ-ప్రైమరీ) తరగతులను ప్రారంభించనుంది. ఈ నిర్ణయం ద్వారా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లలో చెల్లించే భారీ ఫీజుల నుంచి ఉపశమనం పొందడంతో పాటు, ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరగడానికి దోహదపడుతుంది.
ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త ప్రీ ప్రైమరీ విభాగాలు
ప్రభుత్వం ఈ కొత్త ప్రీ-ప్రైమరీ విభాగాలను రెండు రీజియన్లుగా విభజించింది. క్యూర్ రీజియన్లో 529 పాఠశాలలు మరియు నాన్-క్యూర్ రీజియన్లో 2,240 పాఠశాలలు ఉన్నాయి. ఈ తరగతులను తక్షణం ప్రారంభించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పాఠశాలకు రూ.1 లక్ష మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించింది ప్రభుత్వం.

ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణకు ప్రత్యేక ఇన్స్ట్రక్టర్లు, ఆయాలు
ఈ నిధులతో తరగతి గదులు ఆధునీకరించి, రంగురంగుల గోడలు, చిన్నారులకు అనువైన బెంచీలు, ఆటపాటలు, విద్యా సామగ్రి, చార్టులు, బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. చిన్నారులు 3 నుంచి 5 ఏళ్ల వయసు వారు ఆహ్లాదకర వాతావరణంలో విద్య నేర్చుకోవాలనే లక్ష్యంతో ఆటల ద్వారా విద్యాబోధన చేసే విధానాన్ని అనుసరించనున్నారు. ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణకు ప్రత్యేక ఇన్స్ట్రక్టర్లు మరియు ఆయాలను వేతన ప్రాతిపదికన నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఏడాది 2,769 పాఠశాలలకు ప్రీ ప్రైమరీ క్లాసులు
ఇది స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. గతంలో ప్రయోగాత్మకంగా 1,000 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించగా, విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సానుకూల ఫలితాల ఆధారంగానే ఈ ఏడాది 2,769 పాఠశాలలకు విస్తరించారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్లో 74, హన్మకొండలో 39, కరీంనగర్లో 58, వరంగల్లో 48 పాఠశాలలు ఎంపికయ్యాయి.
రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి
రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, చిన్న వయసు నుంచే పిల్లలు నాణ్యమైన విద్యను పొందేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం. ప్రైవేటు స్కూళ్ల ఫీజు భారం తగ్గించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రుల విశ్వాసం పెంచడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ చర్య తెలంగాణలో విద్యా సమానత్వాన్ని సాధించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications