జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం
రాష్ట్రంలోని పది బోధనాస్పత్రుల్లో దాదాపు 4,300 మంది జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నందున కోడ్ అమలులో ఉందని, ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం అంటోంది. హైదరాబాద్ ఎన్నికలను సాకుగా చూపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ సమస్యను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందని జూనియర్ డాక్టర్లు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం కంటి తుడుపు చర్యగానే వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఎంత పెంచుతామనే విషయాన్నైనా ప్రభుత్వం చెప్పకపోవడం దారుణమని వారన్నారు.
జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే అందుకు బాధ్యత తమది కాదని, ప్రభుత్వమే బాధ్యత వహించాలని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. తాము చెబుతూనే ఉన్నామని, అయినా ప్రభుత్వం తమ మాటలను పట్టించుకోలేదని వారంటున్నారు. ప్రజలు, ప్రభుత్వం తమను క్షమించాలని, సమ్మె చేయడం తప్ప మరో మార్గం లేదని వారు చెబుతున్నారు.