22 జిల్లాలకు తల్లి హైదరాబాద్: లగడపాటి
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు దేశాన్ని కలచివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయుడిగా తాను ఎంతో బాధపడుతున్నానన్నారు. "భారత్ని విడగొట్టొద్దు, కలసి ఉందాం'' అన్న మహాత్ముని మాటలు ఒకసారి గుర్తు చేసుకుందామన్నారు. కలిసి ఉండాలనే ఆలోచన ప్రతిజిల్లా వారికి ఉందని, కొన్ని శక్తుల వల్ల ఆందోళనలు మొదలయ్యాయన్నారు. కొందరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు.
జలదోపిడీ అనేది వాస్తవం కాదన్నారు. పోలవరం, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం ఎంపిలందరం కలసికట్టుగా పోరాడి సాధించుకుందామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రక్రియ మొదలవుతుందని యుపిఏ ప్రభుత్వం ప్రకటించిందని, కాంగ్రెస్ పార్టీ కాదని ఆయన వివరించారు. శాసనసభలో తెలంగాణపై తీర్మానం ప్రవేశపెడితే 294 మంది శాసనసభ్యులలో 225 మంది వ్యతిరేకిస్తారని చెప్పారు. రాజీనామా చేసిన శాసనసభ్యులందరూ ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. శాసనసభ్యులందరూ సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చే శారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉద్యమంలో తానూ భాగస్వామినవుతానని చెప్పారు. తన రాజీనామా వ్యక్తిగతమని, తన వైఖరి రేపు మీడియాకు చెపుతానని అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.