తూర్పు గోదావరిలో విద్యాసంస్ధలకు వారం సెలవు
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో తీవ్రరూపం దాలుస్తోంది. ఉద్యమం కోసం అలపక్ష కమిటీ ఏర్పాటై 24 గంటలు కూడా గడవకముందే పరిస్థితి చేయి దాటినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఇందుకు తోడవ్వడంతో జిల్లాలో రాజకీయ ప్రకంపనలు మిన్నంటుతున్నాయి. మూడు రోజులుగా శాంతియుత పంథాలో నడిచిన ఉద్యమం సోమవారం కొన్ని ప్రాంతాల్లో అదుపు తప్పింది.
నాయకులతో ప్రమేయం లేకుండా విద్యార్థులు తరగతులు బహిష్కరించి ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి, అమలాపురంలలో ఆందోళనకారులు ఒక అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, తపాలా కార్యాలయాలపై రాళ్లు రువ్వారు.
ఒక ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టారు. రాజమండ్రిలో విద్యార్థులు సింహాద్రి ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. కాకినాడ, అమలాపురంలలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఆదివారం రాత్రి కాకినాడలో జరిగిన అలపక్ష సమావేశంలో దశలవారీ ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు రిలే దీక్షలకే పరిమితం కావాలి. ఈ నెల 19న పాఠశాలలు, కళాశాలలు బంద్ చేయాలి.
కానీ అనూహ్యంగా విద్యార్థులు సోమవారమే ఉద్యమ బాట పట్టారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం తదితర కీలక ప్రాంతాల్లో విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగసింది. రోడ్లను అష్టదిగ్బంధం చేసింది. న్యాయవాదులు కూడా జిల్లావ్యాప్తంగా కోర్టులను బహిష్కరించి ర్యాలీలు, నిరసన దీక్షలు, ధర్నాలు నిర్వహించారు. కోటనందూరులో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు.